కోచ్‌ గంభీర్‌ చేతిలో సూర్యకుమార్‌ భవితవ్యం?

  • గువాహటిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ భేటీ!
  • సూర్య కెప్టెన్సీపై చర్చ
  • పంత్‌ టెస్ట్ వైస్ కెప్టెన్సీపైనా చర్చ
  • సెకండ్ కీపర్ స్థానానికీ తీవ్ర పోటీ
భారత టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గువాహటిలో మంగళవారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చే సలహాలు చాలా కీలకం కానున్నాయని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. బోర్డు సెక్రటరీ దేవాజిత్ సైకియా కూడా ఈ చర్చలో పాల్గొనున్నారు.

ఈ మధ్య సూర్యకుమార్ ఫామ్‌ ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026లో కూడా ముంబై ఇండియన్స్ తరఫున అతడు సరిగ్గా ఆడడం లేదు. అందుకే అతని కెప్టెన్సీపై సెలక్టర్లు చర్చించనున్నట్లు సమాచారం. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం కొత్త కెప్టెన్సీ ప్లాన్ గురించి మాట్లాడనున్నారని తెలుస్తోంది. సూర్య నాయకత్వంలో భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇదే.

పంత్‌ స్థానంపైనా చర్చ?
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్టు, వన్డే సిరీస్ కోసం ఈ భేటీలో టీమ్‌లను కూడా ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో రిషబ్ పంత్ టెస్ట్ వైస్ కెప్టెన్సీపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం. పంత్‌కు నాయకత్వ బాధ్యతలు అంతగా కలిసిరావడం లేదని బోర్డు భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గత నవంబర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో అతని కెప్టెన్సీ వ్యూహాలు ఫెయిలైన విషయం తెలిసిందే.

నాయకత్వ భారం వల్ల పంత్ తన సహజమైన బ్యాటింగ్‌ను కోల్పోతున్నాడని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే అతనిపై ఒత్తిడి తగ్గించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వన్డే జట్టులో సెకండ్ కీపర్ స్థానం కోసం పంత్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ధ్రువ్ జురెల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రేసులో ఉన్నారు. దీంతో వన్డేల్లో పంత్ స్థానానికీ ముప్పు పొంచి ఉంది.

Suryakumar Yadav
Gautam Gambhir
T20 Captaincy
BCCI
Indian Cricket Team
Rishabh Pant
Indian Cricket
T20 World Cup
Cricket Selection Committee
Mumbai Indians

More Telugu News